- ఎం.ఈ.ఓ కు ట్రస్మా మరియు ప్రైవేటు ఉపాధ్యాయుల సంఘం ఫిర్యాదు
సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్17(జనవిజయం) :సత్తుపల్లిలో తమవి కార్పొరేట్ స్కూల్స్ అని చెప్పుకునే వారు విజయవాడ, గుడివాడ తదితర ప్రాంతాల్లో 10వ తరగతి చదువుతున్న మెరిట్ విద్యార్థులను తీసుకు వచ్చి పదవ తరగతి పరీక్ష రాయించి ఆ ర్యాంకులు, ఆ మార్కులు తమ గొప్పగా ప్రచారం చేసుకుంటూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని గురువారం ట్రస్మా ఆధ్వర్యంలో యాజమాన్యాలు, ఉపాధ్యాయులు సత్తుపల్లి ఎంఈఓ రాజేశ్వరరావు కు ఫిర్యాదు చేశారు.ప్రభుత్వ గుర్తింపు లేని శ్రీ చైతన్య స్కూల్ పేరిట అడ్మిషన్లు తీసుకుంటూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని వినతిపత్రం అందజేశారు.కార్పొరేట్ పాఠశాలల వారు ఇతర బ్రాంచీలలో తమకు వచ్చిన పదవ తరగతి మార్కులు, ఇతర ఎంట్రన్స్ టెస్ట్ ల మార్కులను స్థానిక బ్రాంచ్ పేరిట ముద్రించిన కరపత్రంలో ప్రచురించి అవి తమ గొప్పగా తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మోసగిస్తున్నారని ఆరోపించారు.ఎమ్మార్పీ రేట్లు లేకుండా పుస్తకాలు, ఇతర మెటీరియల్ ముద్రించి నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టాలెంట్ టెస్ట్ లు,అడ్మిషన్ టెస్ట్లు నిర్వహిస్తూ విద్యార్థుల సామర్థ్యానికి మించిన పరీక్షలు పెడుతూ బదనాం చేస్తున్నారు.విద్యార్థులను క్లాసులో వదిలేసి ఉపాధ్యాయులను ఎండ, వాన ,రాత్రి అని కనికరం చూపకుండా అడ్మిషన్ల కోసం ఇళ్ల వెంట తిప్పుతున్నారు.అడ్మిషన్లు తెస్తేనే ఉద్యోగం ఇస్తామని వేధిస్తున్నారు.ఈ అంశాలపై విచారించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంఈఓ రాజేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయుడు వెంకటేశ్వరరావు,పసుపులేటి నాగేశ్వరరావు,పులి శ్రీనివాసరావు,ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.