- ఉపాధి కూలీలకు కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలి
పెండింగ్ వేతనాలు చెల్లించాలి - తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్
సత్తుపల్లి,ఆర్ సి ఏప్రియల్11(జనవిజయం) :తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉపాధి హామీ చట్టం కింద కొత్త జాబ్ కార్డు ఇవ్వకుండా వెబ్సైట్ను లాక్ చేయడం చట్టం మార్గదర్శకాలకు విరుద్ధమని, వెంటనే కొత్త జాబ్ కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం కాకర్లపల్లి గ్రామంలో ఉపాధి కూలీల పని ప్రదేశం సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకొని వారితో మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న వెంటనే గ్రామపంచాయతీ కార్యాలయంలో జాబ్ కార్డు ఇచ్చేలా, కొత్త పేర్లు చేర్చుకునేలా అవకాశం కల్పించాలని కోరారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు పెద్ద ఎత్తున పెరిగారని, వారందరికీ జాబ్ కార్డు ఇవ్వకుండా ఆపడం అంటే ఒక తరాన్ని ఉపాధి పనికి దూరం చేయడంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్య కాకుండా చేయడమే అవుతుందన్నారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వారిని ఆహార భద్రతకు, సామాజిక భద్రతకు, ఆర్థిక అభివృద్ధికి దూరంగా నెట్టే చర్యలకు పాలకులు సిద్ధపడటం దుర్మార్గమని పేర్కొన్నారు, దరఖాస్తు పెట్టుకోగానే ఉపాధి జాబ్ కార్డు లబ్ధిదారులకు జారీ చేసే విధంగా ప్రభుత్వం వెబ్సైటును ఓపెన్ గా ఉంచాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న కూలీలకు రావాల్సిన ఐదు వారాల వేతనాలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు మూడు నెలల జీతాలు వెంటనే చెల్లించాలని కోరారు, పని ప్రదేశాల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు బెజవాడ లక్ష్మీనారాయణ, చిట్టెమ్మ, లక్ష్మీ, జ్యోతి, రాంబాబు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.