జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం బోనకల్ లో టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
సీఎం హామీ ఇచ్చారు కానీ ఆచరణ లేదు
జర్నలిస్టుల ఇళ్ల సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ సీపీఐ (ఎం) తోడుంటుంది
..రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని, పాలడుగు భాస్కర్, జిల్లా కార్యదర్శి నున్నా..
ఖమ్మం, ఏప్రిల్ 23(జనవిజయం):
సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయం పలుమార్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దృష్టికి జర్నలిస్టుల సమస్యను తీసుకెళ్లామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే సందర్భంలోనూ సీపీఐ (ఎం) సీఎం ముందు ఉంచిన ప్రధాన డిమాండ్లలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య ఒకటని పేర్కొన్నారు.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం బోనకల్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆదివారం చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి పోతినేని, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మధిర నియోజకవర్గ ఎన్నికల ఇన్ చార్జి పాలడుగు భాస్కర్, సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్ రావు మాట్లాడుతూ పాత్రికేయ వృత్తి గౌరవంగా ఉంటుంది కానీ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయని తెలిపారు. జర్నలిస్టులో ఆందోళనలు చేసే వరకు పరిస్థితి రాకుండా ప్రభుత్వం చూడాల్సిందన్నారు. పాత్రికేయులు గొంతెమ్మ కోరికలు ఏమి కోరడం లేదన్నారు వారు అడిగింది కేవలం ఇళ్ల స్థలాలు మాత్రమేనని తెలిపారు. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి ముందు సిపిఐ (ఎం) జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పెట్టిందన్నారు. సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన సీఎం ఆరు నెలలైనా ఆచరణలో పెట్టకపోవడం తగదన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం అయ్యేవరకు వారు నిర్వహించే ఆందోళనలకు సిఐటియు మద్దతుగా నిలుస్తుంది అని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ స్పష్టం చేశారు. జర్నలిస్టుల సమస్యల పైన ఓ రాజకీయ పార్టీగా సిపిఎం అండగా నిలబడిందని ఖమ్మంలో జరిగిన ఆందోళనలకు మద్దతుగా నిలబడిన విషయాన్ని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు ఖమ్మం వచ్చిన సీఎంకు సిపిఐ(ఎం) పలు సమస్యల పైన వినతి పత్రం ఇచ్చిందని దానిలో అతి ప్రధాన డిమాండ్లలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది ఒకటన్నారు. ఆనాటి సభలో సీఎం హామీ ఇచ్చిన మేరకు జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. జిల్లా కేంద్రంలో ఉన్న పాత్రికేయులతో పాటు మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లోని జర్నలిస్టులకూ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై ప్రభుత్వం హామీ ఇవ్వడమే కానీ ఆచరణ లేదని బిజెపి జిల్లా నాయకులు నాయక్ విమర్శించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం అయ్యేవరకు దశలవారీగా ఆందోళనలు నిర్వహిస్తున్నామని, దానిలో భాగంగానే బోనకల్ లో ఆదివారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పల్లా కొండలరావు, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
యూనియన్ జిల్లా కోశాధికారి తేనె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు గరిడేపల్లి వెంకటేశ్వర్లు, అంజయ్య, చేబ్రోలు నారాయణ, కోట రవికుమార్, కోటి శివారెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.