ముదిగొండ ఫిబ్రవరి 15(జనవిజయం):
ముదిగొండ మండల పరిధిలోని సువర్నాపురం గ్రామంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులపై అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు దాడులు చేశారు. గ్రామానికి చెందిన కొండూరు రామాంజనేయులు (రామ్), చేకూరి రవి, జెట్టి అశోక్ అనే శ్రీనన్న అభిమానులపై దాడి జరిగింది. బుధవారం ఉండేటి కృష్ణ – ఆదిలక్ష్మి దంపతుల కుమార్తె ఓణీల అలంకరణ వేడుక కార్యక్రమం అయినందున ఆశీర్వాదించడానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్తున్న నేపథ్యంలో సువర్ణపురం శ్రీనన్న అభిమానులు స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న తరుణంలో తెల్లవారుజామున అధికార పార్టీకి చెందిన నేతలు మూకుమ్మడిగా 20 మందితో కలిసి ఫ్లెక్సీ లను చించేసి శ్రీనన్న అభిమాని రామాంజనేయులు, అతని అనుచరులపై అదే గ్రామానికి చెందిన తోట ధర్మారావు,మురళి,అమరబోయిన వీరబాబు,కనపర్తి కోటయ్య,తోట శ్రీను అనే వ్యక్తులు శ్రీనన్న అభిమానులను కులం పేరుతో ….. నా కొడకల్లారా… మీకు రాజకీయాలు అవసరమా?… అంటూ గడ్డ పారలతో, కత్తులతో, వీధి రౌడీలలా గ్రామంలో అరాచకం అలజడి సృష్టించి కొట్టారు. వారిపై విచక్షణా రహితంగా దాడి చేసి కులం పేరుతో దూషించి రామ్ సొంత కార్ ని ధ్వంసం చేసారు. ప్రస్తుతం రామాంజనేయులు అతని అనుచరులు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.