Tuesday, October 3, 2023
Homeవార్తలుఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలి

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలి

ఖమ్మం, జులై 14 (జనవిజయం): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు. శుక్రవారం ఐడిఓసి సమావేశ మందిరంలో ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాన్ని కలెక్టర్‌ నిర్వహించారు. సమావేశంలో అట్రాసిటీ కేసుల పురోగతిపై ఖమ్మం టౌన్‌, ఖమ్మం రూరల్‌, వైరా, కల్లూరు సబ్‌ డివిజన్‌ల వారీగా కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంటరానితనం, మూఢ నమ్మకాలు, అట్రాసిటీలపై చర్చకు కమిటీ సమావేశం ఒక మంచి వేదిక అని అన్నారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోపు చార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలన్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా పకడ్బందీగా దర్యాప్తు జరిపి పూర్తి ఆధారాలను సేకరించి సకాలంలో చార్జ్‌ షీట్‌ ఫైల్‌ చేయాలన్నారు. పోలీస్‌, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని ఆయన తెలిపారు. సామాజిక బహిష్కరణలు విధిస్తూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు ప్రభుత్వం తరపున అందించాల్సిన ఆర్ధిక సహాయాన్ని సకాలంలో అందే విధంగా చూడాలన్నారు. పెండిరగ్‌ ట్రయల్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. విజిలెన్సు అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు, తద్వారా సమస్యలు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. కమిటీలోని అనధికార సభ్యులు కూడా క్రియాశీలక పాత్ర పోషించాలని, క్షేత్ర స్థాయిలో అట్రాసిటీ అంశాలతో ముడిపడి ఉన్న సంఘటనల గురించి ఎప్పటికప్పుడు తమ దృష్టికి తేవాలని అన్నారు. ప్రతీ నెల తప్పనిసరిగా గ్రామాల్లో సివిల్‌ రైట్స్‌ డే నిర్వహించేలా చూడాలని, ఇట్టి కార్యక్రమానికి తహసీల్దార్‌, ఎస్హెచ్‌ఓలు హాజరవ్వాలని ఆయన అన్నారు. 2017 నుండి ఇప్పటి వరకు 594 మంది బాధితులకు రూ. 8,80,11,250ల పరిహారం మంజూరు చేసినట్లు, ఇందులో 174 మంది ఎస్టీ, 420 మంది ఎస్సి బాధితులు ఉన్నట్లు ఆయన అన్నారు.
పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌. వారియర్‌ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నప్పుడు పోలీస్‌ శాఖ తరపున బాధితులకు తప్పనిసరిగా పూర్తి న్యాయం జరిపించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో ఖమ్మం టౌన్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో 9, ఖమ్మం రూరల్‌ పరిధిలో 7, వైరా పరిధిలో 5, కల్లూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో 9, మొత్తంగా 30 కేసులు వివిధ దశలలలో విచారణలో ఉన్నాయన్నారు.
అంతకు ముందు భి.అ ర్‌.అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు
ఈ సమావేశంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, అదనపు కలెక్టర్‌ ఎన్‌.మధుసూదన్‌ జిల్లా రెవిన్యూ అధికారిణి శిరీష, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ, డీటీడబ్ల్యుఓ కృష్ణా నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి డాక్టర్ మాలతీ, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు,
కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ, ఏసీపీలు ప్రసన్నకుమార్‌, గణేష్‌, బస్వా రెడ్డి, రెహ్మాన్‌, రామానుజం, అధికారులు, విజిలెన్సు అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు జి.వీరభద్రం, జే.దాస్‌ మహారాజ్‌, టి.అంజయ్య, కె. రాంబాబు, ఏ.శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments