సండ్రకు ఘనస్వాగతం పలికిన ఆలయ కమిటి!
సత్తుపల్లి,ఫిబ్రవరి 5(జన విజయం): మండల పరిధిలోని కీష్టారం – చెరుకుపల్లి – జగన్నాధపురం గ్రామాల నడుమ వేంచేసి ఉన్న సత్తెమ్మ తల్లి ఆలయం వద్ద నిర్వహించిన తిరునాళ్ల మహోత్సవంలో ఆదివారం సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే సండ్రకి పూర్ణకుంభంతో మేళతాళాలతో ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. సత్తెమ్మ తల్లి అమ్మ వారిని దర్శించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు.అనంతరం సండ్ర మాట్లాడుతూ సత్తెమ్మ తల్లి ఎంతో మహిమ గల అమ్మ వారని అమ్మ అపారమైన ఆశీస్సులు అందరికీ వుండాలని అన్నారు. అనాది కాలం నుండి సరిహద్దు గ్రామాల ప్రజలు ఇలవేల్పుగా అమ్మవారిని పూజిస్తూ, మహోత్సవాలను నిర్వహించడం భక్తి భావాన్ని చాటుతుందన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకి ఆలయ కమిటీ సభ్యులు గ్రామ నాయకులు శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.