Tuesday, October 3, 2023
Homeవార్తలుప్రతి చిన్నారినీ కాపాడుకుందాం: క్రై

ప్రతి చిన్నారినీ కాపాడుకుందాం: క్రై

ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం 2023 సందర్భంగా

ప్రతి చిన్నారినీ కాపాడుకుందాం: క్రై

హైదరాబాద్, జూలై 27 (జనవిజయం):

ఈ ఏడాది జూలై 30వ తేదీన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని, లాభాపేక్షలేని ప్రముఖ భారతీయ స్వచ్ఛంద సంస్థ సి.అర్.వై (క్రై)- చైల్డ్ రైట్స్ అండ్ యు, తెలంగాణలో బాలల అక్రమ రవాణాను అరికట్టటానికి అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

 “ప్రతి ఒక్క అక్రమ రవాణా బాధితులనూ చేరుకోవాలి. ఎవరినీ వదిలివేయవద్దు” అనేది ఈ ఏడాది మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం థీమ్‌గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. భారతదేశంలో మానవ అక్రమ రవాణా బాధితుల్లో చిన్నారుల సంఖ్య చాలా అధికంగా ఉంటోంది. కాబట్టి ప్రతి ఒక్క చిన్నారికీ సమర్థవంతమైన భద్రతా వలయం ఉండేలా చూడాలని క్రై పిలుపునిస్తోంది. ఈ మానవ అక్రమ రవాణా అనేది ఒక “కనిపించని” నేర కార్యకలాపమని పరిగణిస్తారు. అందువల్ల, అది ఎంత తీవ్రంగా ఉందనేది తెలియజేసే విశ్వసనీయమైన సమాచారం, గణాంకాలు సంసిద్ధంగా అందుబాటులో లేవు. మనకు తెలిసిన లేదా నమోదైన కేసుల సంఖ్య.. అసలు ట్రాఫికింగ్ కేసుల్లో కొంత భాగం మాత్రమే. అసలు ట్రాఫికింగ్ కేసుల వాస్తవ విస్తృతి ఎంతగా ఉందనేది తెలియదు. కాబట్టి, వివిధ స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమ రవాణాకు గురైన పిల్లల సంఖ్య ఖచ్చితంగా ఎంత అనేది తెలుసుకోవటం అసాధ్యం.

అయినప్పటికీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ఇటీవలి గణాంకాలు బాలల అక్రమ రవాణా ఆందోళనకరమైన పరిస్థితిని చాటుతున్నాయి. ఈ దారుణ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి. యన్. సి. ఆర్. బి గణాంకాల ప్రకారం, 2021 లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 222 మంది పిల్లలు (18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు) అక్రమ రవాణాకు గురయ్యారు. వారందరినీ యంత్రాంగం రక్షించింది కూడా. ప్రధానంగా లైంగిక దోపిడీ కోసం, శ్రమ దోపిడీ కోసం ఈ మానవ అక్రమ రవాణా జరిగినట్లు ఆ నివేదిక చెప్పింది.

కానీ, ఇదే నివేదికలో అదృశ్యమైన చిన్నారుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. రాష్ట్రంలో 2021 సంవత్సరంలో 2,574 మంది బాలికలు సహా మొత్తం 3,956 మంది చిన్నారులు (18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు) అదృశ్యమైనట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇక మునుపటి సంవత్సరాలలో అదృశ్యమై ఆచూకీ దొరకని చిన్నారుల సంఖ్య 777 మంది (420 మంది బాలికలతో సహా) గా ఉంది. అంటే, 2021 చివరి నాటికి అదృశ్యమైన పిల్లల మొత్తం సంఖ్య 4,733 కాగా.. వీరిలో 2,994 మంది బాలికలు ఉన్నారు. 2021 లో 2,603 మంది బాలికలు సహా 4,079 మంది పిల్లల ఆచూకీని గుర్తించటం లేదా తిరిగి తేవటం జరిగింది. మిగిలిన 654 మంది (వారిలో 391 మంది బాలికలు) చిన్నారుల ఆచూకీ తెలియలేదు. తెలంగాణలో ట్రాఫికింగ్‌కు గురైన చిన్నారుల సంఖ్య 2019 లో 71గా ఉంటే.. 2021 లో 222 కి పెరిగినట్లు NCRB గణాంకాలు చూపుతున్నాయి. అంటే ఈ సంఖ్య మూడేళ్లలో 212 శాతానికి పైగా పెరిగింది.

‘మన పిల్లలను రక్షించడానికి కలిసి పనిచేద్దాం’

చైల్డ్ రైట్స్ అండ్ యు సౌత్ ఇండియా రీజనల్ డైరెక్టర్ జాన్ రాబర్ట్స్ మాట్లాడుతూ, ‘‘చైల్డ్ ట్రాఫికింగ్ అనేది ఒక జుగుప్సాకరమైన నేరం. చిన్నారుల బాల్యాన్ని, వారి భవిష్యత్తును ఇది కాలరాస్తుంది. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా.. ఈ దారుణానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలని, తెలంగాణలోని ప్రతి చిన్నారి భద్రతను, శ్రేయస్సును బలోపేతం చేయాలని మేం కోరుతున్నాం’’ అని పిలుపునిచ్చారు.

‘‘ఒక సమాజంగా, ఈ సంక్షోభం తీవ్రతను గుర్తించడం, మన పిల్లలను దోపిడీ నుంచి, హింస నుంచి రక్షించడానికి మనమంతా చేతులు కలపడం అత్యవసరం’’ అని జాన్ పేర్కొన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వం బాలల హక్కులను కాపాడటానికి, బాలల అక్రమ రవాణాను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని జాన్ రాబర్ట్స్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఇతర భాగస్వాములు తమ కృషిని తీవ్రతరం చేయాలని ఆయన కోరారు.

ప్రభుత్వ యంత్రాంగం: ట్రాఫికర్లను అరెస్టు చేయడానికి చట్ట అమలు వ్యవస్థను బలోపేతం చేయాలి, అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా వ్యవస్థలను అడ్డుకోవటానికి రాష్ట్రాల మధ్య సహకారం మెరుగుపడాలి

ప్రజా సమూహాలు: చిన్నారుల అక్రమ రవాణాను ముందుగా లేదా సత్వరం గుర్తించి, ఫిర్యాదు చేసేలా.. చైల్డ్ ట్రాఫికింగ్ ఆనవాళ్ల గురించి అవగాహన పెంపొందించాలి.

స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం: ట్రాఫికింగ్ నుంచి రక్షించిన చిన్నారుల కోసం బలమైన మద్దతు వ్యవస్థను రూపొందించడానికి.. విద్య, ఆరోగ్య సంరక్షణ, పునరావాసం అందించడానికి కలిసి పని చేయాలి.

సాధారణ ప్రజలు: పిల్లల హక్కులను కాపాడటానికి, చిన్నారులకు స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కల్పించటానికి చేపట్టే కార్యక్రమాలకు క్రియాశీలంగా మద్దతు ఇవ్వాలి

CRY వారం రోజుల అవగాహన కార్యక్రమాలు

ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని, CRY తన భాగస్వామ్య సంస్థలతో కలిసి తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఎఫర్ట్ సంస్థ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు అవగాహన, చైతన్య కార్యక్రమాలను చేపట్టింది. ఈ అవగాహన జూలై 25, 2023 నుండి ప్రారంభమై జూలై 31, 2023 వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు:

  • దీనికోసం కిశోర బాలికలు, తల్లిదండ్రులు, గ్రామ బాలల రక్షణ కమిటీలు, ఇతర సామాజిక సంస్థలకు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, పంచాయతీ కార్యదర్శులు వంటి ముందు వరుసలోని భాగస్వాములకు.. బాలల అక్రమ రవాణా, దానిని నివారించే చర్యల మీద అవగాహన కల్పించటం.
  • ఐసీపీఎస్, పోలీసులు (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు), ఐసీడీఎస్, సీడబ్ల్యూసీ, రెవెన్యూ, సోషల్ వెల్ఫేర్, పంచాయతీ రాజ్, ఐకేపీ, హెల్త్, ఎడ్యుకేషన్ విభాగాల ప్రతినిధులతో పంచాయతీ/మండల/ డివిజన్/జిల్లా స్థాయిల్లో సమన్వయ సమావేశాలు నిర్వహించటం.
  • ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో ప్రయాణికులు, విక్రేతలు, అధికారులకు ట్రాఫికింగ్ సమస్యపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించటం.
  • ‘‘ప్రతి చిన్నారీ ట్రాఫికింగ్ ముప్పు లేకుండా స్వేచ్ఛగా, సురక్షితమైన వాతావరణంలో పెరిగే పరిస్థితి ఉండాలని క్రై బలంగా విశ్వసిస్తుంది. బాలల హక్కుల కోసం క్రై స్థిరంగా కట్టుబడి ఉంది. దుర్బలమైన చిన్నారులను అక్రమ రవాణా నుండి రక్షించడానికి తన నిరంతర కృషినికొనసాగిస్తుంది’’ అని జాన్ రాబర్ట్స్ చెప్పారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments