ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి
- భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నా… ప్రాణ నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న మంత్రి పువ్వాడ
- అత్యవసరం అయితే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి
- భద్రాచలంలో వరద ఉదృతిని పర్యవేక్షించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం, జులై 27 (జనవిజయం):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భద్రాచలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులకు పలు ఆదేశాలు ఇస్తున్నారు.
ప్రకృతి వైపరిత్యాలు అడ్డుకోలేం కానీ నష్టాన్ని నివారించగలం అంటూ జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయి అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ప్రాణనష్టం జరగకుండా పరిస్థితులు చక్కదిద్దాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ను ఆదేశించారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు ఒక పక్క, వివిధ ప్రాజెక్ట్స్ గేట్స్ ఎట్టివేయడం మారో పక్క.. తద్వారా గోదావరికి వరద పోటెత్తిందని మంత్రి పువ్వాడ అన్నారు.
రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రిసిటీ, పంచాయితీ రాజ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, హెల్త్ పలు ప్రభుత్వ శాఖలు అధికారులను, క్షేత్ర స్థాయిలో సిబ్బంది నిత్యం అప్రమత్తం ఉండాలని సూచించారు.
అత్యవసరం అయితే తప్పా ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని మంత్రి పువ్వాడ విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు, జాలర్లు ఎవరూ చేపల వేటకు వెళ్ళొద్దని కోరారు. అకారణంగా ప్రజలను ఎవరిని బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ వినీత్ ను ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా పోలీస్, ఇరిగేషన్ అధికారులందరు ముంపు ప్రాంతాల్లోనే ఉండి పరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
భద్రాచలంలో ప్రస్తుతం కొనసాగుతున్న పునరావాస కేంద్రాలను మెరుగు పరచి మరికొన్ని పునరావాస కేంద్రాలు సిద్దం చేయాలని కలెక్టర్ కు సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉండాలన్నారు.
జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం అస్తి నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని, అందుకు అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు .