మణిపూర్ హింసాకాండపై వాస్తవాలు ప్రజలకు చెప్పాలి
- ప్రధాని మోదీ మౌనం వీడాలి
- లోక్ సభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
- సభను వాయిదా వేసి, కేంద్రం తప్పించుకుంది
- కేంద్రాన్ని వదిలే ప్రసక్తేలేదు
- కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు ధ్వజం
ఖమ్మం, జూలై 20(జనవిజయం) :
మణిపూర్ లో దారుణాలు,హింసాకాండపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుందని,ప్రధాని మోదీ వెంటనే మౌనం వీడి దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం లోక్ సభలో మణిపూర్ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చిన ఎంపీ నామ ఈ అంశంపై చర్చించాలని పార్టీ ఎంపీలతో కలసి పట్టుబట్టారు.
ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ప్రసారమాద్య మాల్లో వైరల్ అయిన ఘటనపై నామ తీవ్రంగా స్పందించారు. ఇది అవమానవీయ ఘటన అన్నారు. ఇటువంటి ఘటనలు సభ్య సమాజానికి సిగ్గు చేటన్నారు. కేంద్ర ప్రభుత్వ చాతగానితనం వల్లనే మణిపూర్ రావణకాష్టంలా మండుతోందని, మృత్యుఘోష కొనసాగుతుందని అన్నారు. దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయని, ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయన్నారు.
వేలాది మంది ఇళ్లను వదిలి, సహాయక శిభిరాల్లో తలదాచు కుంటున్నారని అన్నారు. మహిళల గౌరవాన్ని కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. ఇంకా మణిపూర్ విధ్వంసాలు జరుగుతూనే ఉన్నాయని, ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల్లో వందలాది మంది చనిపోయినట్లు తెలుస్తోందన్నారు. ప్రాణ భయంతో వేలాది మంది తమ నివాసాలను వదలి సహాయక శిభిరాల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని, అక్కడ నరమేధం జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఇప్పటికైనా ప్రధాని స్పందించి, ఆ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు, ఉ ద్రిక్తలు, తాజా ఘటనలపై పార్లమెంట్లో చర్చించాలని నామ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మహిళలపై జరిగిన అఘాయిత్యాన్ని దేశ సర్వోన్నత న్యాయస్ధానం తీవ్రంగా పరిగణించిందని, కానీ నేరస్థులను శిక్షించే విషయంలో ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో సభకు వివరించాల్సిన బాధ్యత ప్రధానిపైనే ఉందన్నారు.
సభ వాయిదాపై నామ మండిపాటు:
సభలో మణిపూర్ అంశాన్ని చర్చించాలని ముందే బీఆర్ఎన్ పార్టీ వాయిదా తీర్మాణం ఇచ్చినా చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం సభను కావాలనే శుక్రవారానికి వాయిదా వేసి, తప్పించుకుందని నామ నాగేశ్వరరావు మండిపడ్డారు. ఎంపీలంతా నామ నాయకత్వంలో సభ ప్రారంభం కాగానే మధ్యాహ్నం మణిపూర్ అంశంపై నభను స్తంభింపజేశారు. మణిపూర్ అంశంపై చర్చకు పట్టుబడుతూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
అయితే స్పీకర్ వెంటనే నభను శుక్రవారానికి వాయిదా వేయడం కరెక్ట్ కాదన్నారు నామ. ప్రజా సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తామని నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు