హైదరాబాద్, జులై 31(జనవిజయం): జీవో నెంబర్ 46 ద్వారా కానిస్టేబుల్ నియామకాల్లో గ్రామీణ జిల్లాల కానిస్టేబుల్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని ఈ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ని గ్రామీణ జిల్లాల కానిస్టేబుల్ అభ్యర్థులు హైదరాబాద్ లో సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ జీవో వల్ల హైదరాబాద్ జిల్లాలో 53శాతం రిజర్వేషన్ ఉండగా మిగిలిన జిల్లాల్లో 47శాతం మాత్రమే ఉందని అభ్యర్థులు పేర్కొన్నారు. దీని ద్వారా గ్రామీణ జిల్లాల్లో 130మార్కులు కంటే ఎక్కువ వచ్చిన అభ్యర్థులకు కూడా ఉద్యోగం రాని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అదే హైదరాబాద్ వాసి అయితే 80కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని పొంగులేటి దృష్టికి తీసుకువెళ్లారు. కావున జీవో నెంబర్ 46 నుంచి టీ ఎస్ ఎస్ పీ పోస్టులను తొలగిస్తే తమకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. వారి వినతి మేరకు తప్పకుండా సమస్య పరిష్కారానికి తన వంతు కృషిచేస్తానని ఈ సందర్భంగా పొంగులేటి హామీ ఇచ్చారు.