- వసతి గృహ ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ ప్రియాంక భద్రాద్రి
కొత్తగూడెం, ఆగష్టు 16 (జనవిజయం): వసతి గృహాల్లో పరిసరాలు అపరిశుభ్రం గా ఉంటే విద్యార్థులు ఎలా చదువుకుంటారని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ప్రశ్నించారు. మీ పిల్లలను, మీ ఇంటిని ఇలాగే అపరిశుభ్రంగా ఉంచుతారా? పిల్లలకు ట్రంక్ పెట్టెలు ఇవ్వలేదు, బెడ్స్ ఇవ్వలేదు .. హాస్టల్ అపరిశుభ్రంగా ఉంది .. ఇలా ఉంటే పిల్లలు ఏ విధంగా చదువుకుంటారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఎస్సి అభివృద్ధి శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం పాల్వంచ మండలం అంబేద్కర్ సెంటర్ లోని షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ని బాలుర వసతిగృహాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. వంటగదిని, విద్యార్థుల రూములను పరిశీలించారు.
విద్యార్థులతో ఎలాంటి ఆహారం పెడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు మెనూ ప్రకారం ఆహారం ఇస్తున్నారా లేదా అని వంటగదిని పరిశీలించారు. రూములకు వైట్వాష్ లేదు, ఎక్కడి బూజులు అక్కడే ఉన్నాయి, వంటగదిలో అపరిశుభ్రత ఉంది, అక్కడే వంట సామాగ్రి ప్రక్కనే చెత్త ఉంది. ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పాచ్ వర్కులున్నాయి ఏంటి ఈ దుస్థితి అని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారికి తక్షణమే ఫోన్ చేసి విద్యార్థులకు ఏం సామాన్లు ఇస్తున్నారు తనకు నివేదిక అందచేయాలని ఆదేశించారు. రిజిష్టర్ లో నమోదులు ప్రకారం విద్యార్థులు ఇక్కడ లేరని, ఎందుకు వ్యత్యాసం వస్తున్నదని వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కిషోర్ అనే 8వ తరగతి విద్యార్ధిని ఎందుకు బడికి వెళ్లలేదని అడిగి తెలుసుకున్నారు. జ్వరం వస్తున్నకారణంగా వెళ్లలేకపోయానని విద్యార్థి తెలుపగా ఎన్ని రోజుల నుండి జ్వరం వస్తున్నదని, ఆసుపత్రిలో చూపించారా లేదా మందులు వేసుకున్నావా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇవ్వకపోతే తనకు చెప్పాలని, పరీక్షలు నిర్వహించుటకు చర్యలు తీసుకుంటానని విద్యార్థికి సూచించారు. వ్యాధులు ప్రబలే కాలమని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు క్రమం తప్పక ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
హాస్టల్ నిర్వహణ తీరు అస్సలు బాలేదని, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని మళ్లీ తాను పరిశీలనకు వస్తానని మార్పు కనబడకుంటే చర్యలు తీసుకుంటానని వార్డెన్ను హెచ్చరించారు. ఎక్కడి నుండి వస్తారు, ఎందుకు స్థానికంగా ఉండటం లేదని, ఎవరొచ్చినా వార్డెన్ అందుబాటులో ఉండరట అంటూ వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైట్వాష్ వేయించినట్లు చెప్తున్నారు కానీ ఎక్కడా వేసిన దాఖలాలు లేవని వార్డెన్ను ప్రశ్నించగా బయట వేయించామని చెప్పగా బయట వేస్తే ఏం లాభం విద్యార్థులుండే గదులకు వేయించాలని ఆదేశించారు.