నిరంతర పర్యవేక్షణతో వరద పరిస్థితులను అంచనా వేయాలి
- మంత్రి పువ్వాడ అజెయ్ కుమార్
ఖమ్మం, జులై 27 (జనవిజయం):
అధికారులు, సిబ్బంది నిరంతర పర్యవేక్షణతో వరద పరిస్థితులను అంచనా వేయాలని, తదనుగుణంగా సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కాల్వ ఓడ్డు మున్నేటి ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, పోలీసు కమీషనర్ విష్ణు.యస్.వారియర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్విరామంగా కురుస్తున్న వర్షాలతో మున్నేరు ఉదృతంగా 30 ఆడుగల మేర ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది తక్షణమే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో రాబోయే 48 గంటలు జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున జాగ్రత్తగా వుండి, ఆస్థి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్కు మంత్రి సూచించారు.
వాతావరణ శాఖ సూచన ప్రకారం జిల్లాలో 40 సెంటిమీటర్లకు పైగా వర్ష సూచన ఉన్నాయని అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ చేస్తూ, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్, రెవెన్యూ, పిఆర్, ఆర్ అండ్ బి, ఇర్రిగేషన్ ఇంజనీర్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. లోతట్టు ప్రాంతాలైన వెంకటేశ్వర నగర్, మోతినగర్, బొక్కలగడ్డ, జలగం నగర్, దానవాయిగూడెం ప్రజలను పూర్తి స్థాయిలో పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.
మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుందని, ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం నయాబజార్ ప్రభుత్వ పాఠశాల, రామన్నపేట ప్రభుత్వ పాఠశాల ధంసలాపురం కందగట్ల ఫంక్షన్హాల్, పోలేపల్లి సాయి టెంపుల్, జలగం నగర్ రామలీలా ఫంక్షన్హాల్లో ఎర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు ప్రజలు వెళ్లాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న కల్వర్టుల వద్ద ప్రవాహం అధికమైన చోట ప్రజలు నేరుగా రాకపోకలు జరపకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ ను విష్ణు ఎస్.వారియర్ ను ఆదేశించారు. ప్రమాదానికి ఆస్కారం వుండి, అవసరమున్నచోట రహదారిని మూసివేయాలని, రాకపోకలు జరపకుండా భద్రత ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదమున్న చెరువుల వద్ద ఇసుక బస్తాలు సిద్దం చేసుకోవాలన్నారు. వర్షంలో చేపలు పట్టుటకు వెళ్లకుండా చూడాలన్నారు.
లోతట్టు ముంపు ప్రదేశాల్లో వర్షపు నీరు ఇండ్లలోకి రాకుండా తగుచర్యలు చేపట్టాలన్నారు. అధికారులు ప్రధాన కార్యస్తానంలోనే ఉంటూ, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ముంపుకు గురయ్యే ప్రాంతాలు, పీఆర్, ఆర్ అండ్ బి రోడ్లపై, కల్వర్టులపై నీరు ప్రవహించే ప్రాంతాల్లో రవాణా నిషేధించి, రాత్రి పగలు సిబ్బందితో నిఘా పెట్టాలన్నారు. రోడ్లపై రవాణా నిషేధించిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ రోడ్లను సూచిస్తూ, 2 కి.మీ. ముందుగానే సూచికలు ప్రదర్శించాలని, ప్రవాహంకి ఇరువైపుల ట్రాక్టర్లు అడ్డంగా పెట్టి, సిబ్బందిని కాపలా పెట్టాలని ఆయన తెలిపారు.
మంత్రి వెంట నగర మేయర్ పూనుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, నగరపాల సంస్థ కమీషనర్ ఆదర్భ్ సురభి ఇర్రిగేషన్ చీఫ్ ఇంజనీరు శంకర్నాయక్, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తదితరులు ఉన్నారు.