ఖమ్మం, జూలై 14(జనవిజయం): జిల్లాలో డ్రాఫ్ట్ ఓటరు జాబితా రూపకల్పన పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికలపై సమీక్షా సమావేశం 2023 -అవగాహన, ఈ.వి.ఎం. లు, వి.వి. ప్యాట్ ల ఉపయోగం కోసం డిజిటల్ ఔట్రీచ్ పై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండవ విడత ఓటర్ జాబితా సవరణలో భాగంగా డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల ముందు, మనకు వచ్చిన ప్రతి దరఖాస్తు స్క్రూటినీ పూర్తి చేయాలని, ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధృవీకరణ పూర్తి చేయాలని, ఇంటికి 6 కంటే అధికంగా ఉన్న ఓటర్ల వివరాల ధృవీకరణను పూర్తి చేయాలని తెలిపారు. ఓటరు జాబితా నుంచి పెద్ద ఎత్తున ఓటర్ల వివరాలు తొలగించిన నేపథ్యంలో దానికి గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలని, ఫోటో సిమిలర్ ఎంట్రీ, డబుల్ ఎంట్రీ తొలగించాలని అన్నారు. జిల్లాలో ఇంటింటి సర్వే నేపథ్యంలో వచ్చిన దరఖాస్తులు, ఆన్ లైన్ ద్వారా ఫారం 6, ఫారం 7, ఫారం 8 క్రింద వచ్చిన దరఖాస్తులను జూలై 27 నాటికి ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద భారత ఎన్నికల సంఘం నిర్దేశాల మేరకు ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన అన్ని మౌళిక వసతులు ఉండాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపుల ఏర్పాటు, లైటింగ్, త్రాగునీరు, అవసరమైన ఫర్నీచర్, పురుషులకు, స్త్రీలకు ప్రత్యేకంగా టాయిలెట్లు, ఇతర సదుపాయాలు ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంటే నూతన పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం రూపోందించిన జిల్లా ఎన్నికల ప్రణాళికను సమర్పించాలని సూచించారు. జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం వారిగా ప్రణాళిక తయారు చేసుకోవాలని అన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బంది, అందుబాటులో ఉన్న సిబ్బంది, వారికి శిక్షణ తదితర అంశాలతో సంపూర్ణ సమాచారంతో ప్రణాళిక రూపోందించాలని తెలిపారు. జిల్లాలో జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో ఈవిఎం, వివిప్యాట్ వినియోగంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. భారత ఎన్నికల సంఘం నిర్దేశం నుంచి జూలై 28 నుంచి స్విప్ కార్యక్రమాలు విస్తృతం చేయాలని, స్విప్ కార్యక్రమాల నిర్వహణపై రాజకీయ పార్టీలకు సమాచారం అందించాలని అన్నారు. ఎఫ్.ఎల్.సి పూర్తయిందని, సరిగ్గా పని చేస్తున్న , ఈవిఎం, వివిప్యాట్ యంత్రాల వివరాలు రాజకీయ పార్టీలకు ఇవ్వాలని, ఈవిఎం, వివిప్యాట్ యంత్రాలు ఉండే స్ట్రాంగ్ రూంకు పటిష్ట భద్రత కల్పించాలని, ఫైర్ ప్రమాదం నియంత్రణ కోసం ఫైర్ అలారంలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేయాలని అన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, జిల్లాలో ఫారం-6, 7, 8 దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరిస్తామన్నారు. బూత్ స్థాయి అధికారుల డోర్ టు డోర్ వేరిఫికేషన్ ప్రక్రియ జూన్ మాసంలోనే పూర్తి చేసినట్లు ఆయన అన్నారు. తొలగించిన ఓట్ల పరిశీలన పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. వివిప్యాట్, ఓటింగ్ యంత్రాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌళిక సదుపాయాల కల్పన చేయనున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ వారిగా ఎన్నికల నిర్వహణ కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆయన అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, జిల్లా రెవిన్యూ అధికారిణి ఆర్. శిరీష, కల్లూరు ఆర్డీవో సిహెచ్. సూర్యనారాయణ, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్, ఖమ్మం అర్బన్ తహశీల్దార్ శైలజ, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.