ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం, వివిప్యాట్ ల వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలి
- ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
ఖమ్మం, జూలై 20(జనవిజయం):
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం, వివిప్యాట్ ల వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం ఐడిఓసి లో ఏర్పాటు చేసిన ఈవిఎం, వివిప్యాట్ అవగాహన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తి చేసుకున్న ఈవీఎం యంత్రాల్లో 10 శాతం యంత్రాలను, వివి ప్యాట్లను సిబ్బంది శిక్షణ, ఓటర్లలో అవగాహన కార్యక్రమాల కొరకు వినియోగిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించు కోవడం మన జన్మ హక్కు అని, ఈవీఎం యంత్రాలు, వివి ప్యాట్ ల ద్వారా ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలనే దాని పై ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కోసం అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు, పోలింగ్ కేంద్రం పరిధిలో ఈ వాహనాలు వెళ్ళి ప్రజలకు అవగాహన కల్పిస్తాయని కలెక్టర్ అన్నారు.
ఐడిఓసి, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రిటర్నింగ్ అధికారుల కార్యాలయం పరిధిలో సైతం అవగాహన కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, జిల్లాలో ముఖ్యమైన ప్రదేశాలలో విస్తృతంగా అవగాహన కల్పించనున్నట్లు, ఈవీఎం, వివిప్యాట్ వినియోగించుకుని ఓటు ఎలా వేయాలని దానిపై విస్తృత ప్రచారం చేస్తామని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్, కలెక్టరేట్ ఏవో అరుణ, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.