ఖమ్మం, జూలై 25 (జనవిజయం):
ఎలక్టోరల్ కు సంబంధించి, ఫారం-6, 7, 8 ల ద్వారా సమర్పించిన దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేసి, త్వరిగతిన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా ఎన్నికల అధికారులతో దరఖాస్తుల పరిష్కార ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాల వారిగా దరఖాస్తులు, పరిష్కారం, పెండింగ్ దరఖాస్తుల పై సమీక్ష చేశారు. దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి, ఎన్నికల కమీషన్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, జిల్లాలో ఓటర్ నమోదు, మార్పులు చేర్పులు, తొలగింపు ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఫారం-6 క్రింద 33933 దరఖాస్తులు అందగా, 28427 దరఖాస్తుల పరిష్కారం చేసినట్లు, 5506 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయన్నారు. ఫారం-7 క్రింద 11511 దరఖాస్తులు రాగా, 6798 దరఖాస్తుల పరిష్కారం కాగా, 4713 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు, అలాగే ఫారం-8 క్రింద 24772 దరఖాస్తులు రాగా, 20167 దరఖాస్తులు పరిష్కరించినట్లు, 4607 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. పెండింగ్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేసి, త్వరితగతిన పరిష్కారం చేసేలా చర్యలు చేపట్టనున్నట్లు, ఎన్నికల కమీషన్ పోర్టల్ లో అప్లోడ్ పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, ఎస్డీసి దశరథ్, కలెక్టరేట్ ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ రాంబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.