- నిర్మాణ కార్మికుల చట్టంలో ఇతర కార్మికులు నమోదు కాకూడదు
- జిల్లా కార్మికాధికారి కె. విజయభాస్కర్ రెడ్డి
- భవన కార్మికుల దాహార్తిని తీర్చడమే సంక్షేమ బోర్డు లక్ష్యం
సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్19(జనవిజయం): భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిలో కేవలం బోర్డు గుర్తించిన భవన మరియు ఇతర నిర్మాణ పనులు చేసే మేస్త్రీలు, కార్మికులు విధిగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఇతర పనులు చేసే కార్మికులు చేసుకోకూడదని అలా చేసుకుంటే చట్టరీత్యా నేరమని ఖమ్మం జిల్లా కార్మికాధికారి కె.విజయభాస్కర్ రెడ్డి తెలిపారు.శనివారం ఉదయం సత్తుపల్లి లోని రింగ్ సెంటర్ వద్ద గల భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కొందరు వ్యక్తులు తమ జీవనాధారంగా లేబర్ ఇన్సూరెన్స్ పాలసీ పేరుతో ప్రజలలో తిరుగుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిలో పథకాలను ఎరగా చూపి ప్రజలను మోసం చేస్తూ వారి నుండి డబ్బులు దండు కుoటున్నారని అలాంటి వారిని నిరోధించాల్సిన బాధ్యత కార్మికులపై కూడా ఉందని అప్పుడే భవన నిర్మాణ కార్మికుల నిధులు సక్రమంగా ఖర్చు అవుతాయని,నిజమైన భవన ఇతర నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు.భవన నిర్మాణ కార్మికుని కానీ వ్యక్తికి ఒక్క పైసా కూడా చేరకుండా ఉండేదానికి జిల్లా స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలనలు చేస్తున్నట్లు విజయభాస్కర్ రెడ్డి తెలిపారు.ముందుగా తెలంగాణ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి ఆదేశాల మేరకు సత్తుపల్లి సహాయ కార్మికాధికారి కార్యాలయం ఆధ్వర్యంలో పట్టణంలోని రింగ్ సెంటర్ లోని లలితకుమారి ఆసుపత్రి వీధి వద్ద ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని ఆయన రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.కార్మికులకు స్వయంగా త్రాగు నీరు పోసి చూపరులను ఆకట్టుకున్నారు.పట్టణ ప్రాంతాలలో అడ్డాల వద్ద వేసవి కాలంలో వడదెబ్బకు భవన నిర్మాణ కార్మికులు గురి కాకూడదనే సదుద్దేశంతో, దాహార్తిని తీర్చాలనే లక్ష్యంతో తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి రాష్ట్ర వ్యాప్తంగా అడ్డాల వద్ద చలి వేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని భవన నిర్మాణ కార్మికులు అట్టి సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కార్మికాధికారి కోరారు.కార్మిక సంఘాల నేతలు జిల్లా అధికారికి పూల బొకేలు ఇచ్చి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో:- ఇంచార్జీ సత్తుపల్లి సహాయ కార్మికాధికారి వెంగమ్మ,కార్యాలయ జూనియర్ సహాయకులు శ్రీనివాస్,సబార్డినేట్ లు సయ్యద్ మసూబ్,సంతోష్, సిఐటియు అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటి సభ్యులు మల్లూరు చంద్రశేఖర్, ఏ.ఐ.టి.యు.సి అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నేత నిమ్మటూరు రామకృష్ణ,శ్రీను,వీరబాబు తదితరులు పాల్గొన్నారు.