- కక్షపూరితంగా వ్యవహరిస్తున్న అధికారులు
- పోలీసు కేసు పెట్టవలసిన అవసరం ఏముంది?
- ప్రశ్నార్థకంగా మారిన రాకేష్ పిల్లల భవిష్యత్!
- ఆందోళనలో బిల్ కలెక్టర్ల కుటుంబాలు
- రాకేష్ కుటుంబానికి 50 లక్షలు ఎక్సగ్రేషియా చెల్లించాలి
- ఎన్.పిడిసిఎల్ కంపెనీ కార్యదర్శి ఎం.ప్రసాద్
వైరా, ఆగష్టు 14 (జనవిజయం): విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, వేదింపులు ఫలితంగా మధిర పట్టణానికి చెందిన విద్యుత్ ప్రైవేట్ బిల్ కలెక్టర్ కొయ్యల రాకేష్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే. రాకేష్ కు భార్య, ఐదు సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రాకేష్ మరణంతో భార్య, పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. రాకేష్ ఆత్మహత్యతో విద్యుత్ బిల్ కలెక్టర్ల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బిల్ కలెక్టర్ల సమస్యల పరిష్కారం కోసం పోరాడిన రాకేష్
ఖమ్మం జిల్లా వైరా డివిజన్ మధిర ఇఆర్ఓ కార్యాలయంలో రిటైర్డ్ జెఎఓ కొయ్యల జానకిరాములు ఏకైక కుమారుడు కొయ్యల రాకేష్ మధిర విద్యుత్ ప్రైవేటు బిల్ కలెక్టరుగా పని చేస్తున్నాడు. ఎర్రుపాలెం, మామునూరు సెక్షన్లలో విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నాడు. విద్యుత్ ప్రైవేటు బిల్ కలెక్టర్ల సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం ఇవ్వాలని సిఐటియు ఆద్వర్యంలో నిర్వహించిన ధర్నాలు, పలు పోరాటాలలో చురుకుగా పాల్గొన్నారు. బిల్ కలెక్టర్ల సమస్యల పైన జిల్లా అధికారులు, రాష్ట్ర నేతలను కలిశాడు.
పూర్తిస్థాయి విచారణ చేయకుండానే కేసు నమోదు
పూర్తిస్థాయిలో విచారణ చేయకుండా ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల నుంచి సబ్సిడీ డబ్బులు సుమారు మూడు లక్షలు వసూలు చేసి దుర్వినియోగం చేశాడని ఆరోపిస్తూ విద్యుత్ శాఖ అధికారులు పోలీసు కేసు పెట్టడంతో తీవ్ర మనస్థాపం చెందిన కొయ్యల రాకేష్ విష పూరిత పదార్థాలు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏరోజు వసూలు అయున డబ్బులు అదేరోజు పై అధికారులకు జమచేస్తారని, డబ్బులు దుర్వినియోగం చెయ్యలేదని, నిబంధనల ప్రకారం సబ్సిడీ డబ్బులు వసూలు చేయకపోయినా విద్యుత్ శాఖ అధికారులు కక్షపూరితంగా వ్యవహరించి కొయ్యల రాకేష్ ఆత్మహత్యకు కారణం అయ్యారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పోలీసు కేసు పెట్టవలసిన అవసరం ఏముంది? !
బిల్లు కలెక్టర్లు తరపున సొసైటీ 10 లక్షల వరకు బ్యాంకు గ్యారెంటీ ఇచ్చింది, ఇద్దరు ఉద్యోగస్తుల గ్యారెంటీ ఉన్నది. రాకేష్ వారి ఆధీనంలోనే పనిచేస్తున్నాడు కాబట్టి విచారణలో దోషి అని తేలితే రికవరీ నోటీసు ఇచ్చి వడ్డీతో సహా వసూలు చేయవచ్చును. పోలీసు కేసు పెట్టాల్సిన అవసరం లేదు. అసలు మూడు లక్షలు ఎలా దుర్వినియోగం అవుతాయి. అప్పటివరకు అధికారులు ఏం చేస్తున్నారని, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని, తాము ఏం చేసినా పై అధికారుల అండదండలు ఉంటాయి అనే ధీమా స్థానిక అధికారులలో కనిపిస్తుందని, స్థానిక అధికారులు, జిల్లా అధికారులు కక్ష గట్టి రాకేష్ ఆత్మహత్య చేసుకునే వరకు వెంబడించారని పలువురు బిల్ కలెక్టర్లు ఆరోపిస్తున్నారు.
విద్యుత్ అధికారులు నిర్లక్ష్యపు ధోరణితో వ్యవహరిస్తున్నారని, కనీస వేతనాలు చెల్లించకపోయినా, ఉద్యోగ భద్రత కల్పించకపోయినా కష్టపడి పని చేస్తున్న బిల్ కలెక్టర్లను అధికారులు కనీసం దయ, మానవత్వం లేకుండా వేధిస్తున్నారని, నిజాయితీగా పని చేస్తున్న బిల్ కలెక్టర్ల పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టడం దారుణమని తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు అనుబంధం) కంపెనీ కార్యదర్శి ఎం.ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. నిజంగా విద్యుత్ శాఖలో అంతా నిజాయితీ ఉంటే కోట్ల నష్టం ఎందుకు వస్తుందని, అనేక అవమానాలు ఎదుర్కొంటూ ఎంతో కష్టపడి పనిచేస్తున్న బిల్ కలెక్టర్ల పైన అధికారుల ధోరణి మారాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు చెల్లించాలని, రాకేష్ ను వేధించిన అధికారులు పైన చర్య తీసుకోవాలని, 50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించి రాకేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.