ప్రీతి నాయక్ మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి!
.బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ.
ఖమ్మం, ఫిబ్రవరి 27 (జనవిజయం): బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు, కాకతీయ మెడికల్ కాలేజ్ గిరిజన విద్యార్థిని ధరావాత్ ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని, ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులు ఖమ్మం నగరంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ చౌరస్తాలో ఈరోజు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఆయన మాట్లాడుతూ గిరిజన బిడ్డ వైద్య విద్యార్థి డాక్టర్ ధరావత్ ప్రీతి నాయక్ మరణానికి కారునమైనటువంటి వారిని తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజ్ KMC నందు జూనియర్ వైద్య విద్యార్థిగా విద్యను అభ్యసిస్తున్నటువంటి డాక్టర్ ధరావత్ ప్రీతి నాయక్ తన సీనియర్ అయిన సైఫ్ అనే వ్యక్తి చేసిన ర్యాగింగ్ భూతం వలన మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి గత ఐదు రోజుల నుండి హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ నందు మృత్యువుతో పోరాడి ది 26-02-2023 ఆదివారం రాత్రి 9:00 గంటల 10 నిమిషాలకు మరణించారని తెలిపారు. ప్రీతి నాయక్ కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని, కేవలం ఓట్లు సీట్ల కే పరిమితం అవ్వకుండా వెంటనే నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి సీఎం డౌన్ డౌన్, ప్రీతి నాయక్ జోహార్, రాష్ట్ర హోం మంత్రి డౌన్ డౌన్ నినాదాలు చేశారు.ఇలాంటి సంఘటన మరల పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా ఇంచార్జ్ విజయలక్ష్మి, జిల్లా బిజెపి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.