వ్యవసాయం, సంక్షేమానికి ఉన్నంతలో ఫర్వాలేదుఉన్నత
విద్యకు, వైద్యానికి నిధులు పెంచాలి
– సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
ఖమ్మం,ఫిబ్రవరి 6(జనవిజయం)
రు.2,90,396 లక్షల కోట్లతో రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్రావు గారు సోమవారం నాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2023-24) కేటాయింపులు బాగున్నాయని,గత బడ్జెట్ను పరిశీలించినపుడు వ్యయంపైనే అనుమానాలున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు.ఉన్నంతలో వ్యవసాయ రంగానికి,సంక్షేమ రంగానికి కేటాయింపులు ఫరవాలేదన్నారు.రైతు రుణమాఫీ హామీని వడ్డీతో సహా నెరవేర్చాలన్నారు.డబుల్ బెడ్రూం ఇళ్ళకు 5 లక్షలు కేటాయించాలన్నారు.ఉన్నత విద్యకు,వైద్య రంగానికి కేటాయింపులు తగిన విధంగా లేవన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాకు త్రాగునీరు,9 లక్షల ఎకరాలకు సాగు నీరందించే సీతారామ ప్రాజెక్టు నత్తతో పోటీపడి నడుస్తోందని, ఇరిగేషన్ పద్దుల్లో నుండి ఈ బడ్జెట్లో పూర్తి నిధులు కేటాయించాలని,ఖమ్మంను పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా ఈ బడ్జెట్లో కేటాయింపులుండాలన్నారు.గత రివైజ్డ్ బడ్జెట్లలో వ్యవసాయ,సంక్షేమ రంగాలకే కోత విధించారని గుర్తు చేశారు. వడ్డీలకే 20 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని,తలసరి ఆదాయం జాతీయ సగటు కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్నప్పటికీ ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నాయని,పేదరిక నిర్మూలనకు బడ్జెట్లో కేటాయింపులుండాలన్నారు.80 శాతం మందికి నాణ్యమైన ఉచిత విద్య,వైద్యం లభించినపుడే నిజమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇది ఎన్నికల బడ్జెట్గా మిగలకుండా నూరు శాతం ఆచరణలో వ్యయం చేసే బడ్జెట్ ఉండాలన్నారు.