కక్షిదారులు మొబైల్ కోర్టును సద్వినియోగం చేసుకోవాలి
.. మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ ఈ.జాన్ రాజ్..
భద్రాచలం, ఏప్రిల్ 21(జనవిజయం): కక్షిదారులు కేసుల పరిష్కారం కోసం రాజీమార్గం ద్వారా సత్వరం పరిష్కరించుకోవాలని రంపచోడవరం సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కోర్టు (మొబైల్ కోర్టు) మెజిస్ట్రేట్ ఈ.జాన్ రాజ్ పేర్కొన్నారు. ఎటపాక మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం రంపచోడవరం మొబైల్ కోర్టును నిర్వహించారు.
ఈ సందర్భంగా మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ ఈ.జాన్ రాజ్ మాట్లాడుతూ 4 మండలాల్లో అపరిస్కృతంగా మిగిలిపోయిన భూ సంభంద కేసులను పరిష్కరించడానికి మొబైల్ కోర్టు ఏర్పాటు చేయబడిందని తెలిపారు. అత్యంత విలువైన కోర్టు సమయం కక్షిదారుల సమయం వృధా కాకుండా కోర్టు చుట్టు సంవత్సరాలు తరబడి తిరగకుండా ఇరుపక్షాలు రాజీ కుదుర్చుకొని కేసులను పరిష్కరించుకునేలా ముందుకు రావాలని ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే కక్షిదారులకు మేలు జరుగుతుందని మేజస్ట్రేట్ ఈ.జాన్ రాజ్ పేర్కొన్నారు. ఈ మొబైల్ కోర్టులో 130 కేసులపై విచారణ జరగ్గా సుమారు 150 మంది కక్షిదారులు హాజరయ్యారు. అనంతరం కక్షిదారుల సౌకర్యార్థం నెలలో ఒక్కరోజు ఎటపాక తహశీల్దార్ కార్యాలయంలో మొబైల్ కోర్టు నిర్వహించాలని మెజిస్ట్రేట్ ఈ.జాన్ రాజ్ కు న్యాయవాదులు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది రమేష్ , న్యాయవాదులు గోడపర్తి నాగరాజు , పేరాల నాగరాజు , అవులూరి సత్యనారాయణ , పేరాల వెంకటేశ్వరర్లు , దన్నాన రాము , పాయం రవివర్మ , చెన్నారెడ్డి , పడిసిరి శ్రీనివాసరావు , పసుపులేటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.