- సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
-చీఫ్ ఇంజినీర్ను కలిసి వినతి పత్రం ఇచ్చిన భూ నిర్వాసితులు
ఖమ్మం,ఫిబ్రవరి 6(జనవిజయం)
సీతారామ ప్రాజెక్టు క్రింద భూములు కోల్పోవుచున్న డోర్నకల్,బుద్దారం,పుల్లూరు రైతులు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ ఈ రోజు ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతుల వెంట చీఫ్ ఇంజినీర్ గారిని కలిసిన సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ 3 సం.ల క్రితం సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణము కోసం భూములు ఇచ్చిన రైతులకు నేటికీ నష్ట పరిహారం ఇవ్వలేదని,అలాగే ఈ 3 సం.ల కాలానికి కనీసం రైతు బంధు పథకం కూడా అట్టి భూములకు వర్తింపచేయలేదని,కనీసం పంట సాగు కూడా చేయనీయకుండా ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు.డబ్బులు వస్తాయన్న భరోసాతో కొద్దిమంది రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసి,వడ్డీలు కట్టలేక ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసారని అన్నారు.గత 3 సం.లుగా రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ఈ విషయంగా ఎన్నో సార్లు మౌకికముగా, వ్రాతపూర్వకంగా అధికారులకు,ప్రజా ప్రతినిధులకు తెలియచేసినప్పటికీ ప్రయోజనం లేకపోయిందన్నారు.ప్రభుత్వం వెంటనే భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం అందించాలని,అలాగే ఈ 3 సం.ల కాలానికి రైతులకు రైతుబంధు కూడా యిచ్చి తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో వున్న రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందుల శ్రీనివాసరావు, రైతు సంఘం నాయకులు బాగం లోకేశ్వరరావు, టిఆర్ఎస్ నాయకులు మాదా శ్రీనివాసరావు, భూ నిర్వాసితులు సింగం వెంకటేశ్వర్లు, నంద్యా,రాందాసు,రమేష్,తేజ్యా,శంకర్,మోహన్, యితర డోర్నకల్, బుద్దారం, పుల్లూరు గ్రామాల భూములు కోల్పోయిన రైతులు పాల్గొన్నారు.